కార్తీక పౌర్ణమి విశిష్టత
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ''త్రిపుర పూర్ణిమ'', ''దేవ దీపావళి'' అని కూడా అంటారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. పౌర్ణమినాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైంది, సాదారణంగా కృత్తిక నక్షత్రం కార్తీక పౌర్ణమి కలసి వస్తుంటాయి. ఆ నక్షత్రంలో దీపారాధన చేయడం శ్రేష్టం. ఈ నక్షత్రంలో చేసే దీపారాధనకు కృత్తిక దీపం అనే పేరుకూడా ఉంది. కార్తీక పౌర్ణమి విశిష్టత, ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం..
సర్వపాపాలు.
కార్తీకపౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీతొలగిపోతాయి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆలయానికి వెళ్లి దీపం వెలిగించి, పూజలు నిర్వహించాలి.....
ఉసిరిదీపం.
పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం, సాయంత్రం శుచిగా ఉసిరికాయతో దీపాలు వెలిగించాలి. బియ్యపిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనే కూడా వాడవచ్చు.
365వత్తుల దీపం.
కార్తీక పౌర్ణమిన రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో దీపాన్ని వెలిగించాలి.
రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది.
శివుడి దర్శనం
పౌర్ణమి రోజు శివాలయంలో పెట్టే ఆకాశదీపాన్ని దర్శించుకుంటే.. సాక్షాత్తు ఆ పరమశివుడినే దర్శించుకున్న ఫలితం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు విష్ణువు మత్య్సఅవతారంలో దర్శనిమిస్తాడు. పాయసం నైవేద్యం.
కార్తీక పౌర్ణమి రోజు శివుడికి రాత్రి పాయసం నైవేద్యంగా సమర్పించాలి. కొంతమీరు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత, సంపద జీవితంలో పొందుతారు.....
నరాలకు మంచిది
కార్తీక పౌర్ణమి రోజు 4 నుంచి 5 నిమిషాలు చంద్రుడు కిరణాలు మీమీద పడటం వల్ల నరాలు, కళ్ళు రిలాక్స్ అవుతాయి. కార్తీక పౌర్ణమి రోజు నాలుగు వైపులు ఉండే దీపాన్ని వెలిగించాలి. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర వైపులుగా ఉండే ఈ దీపాన్ని ఆంజనేయుడి విగ్రహం ముందు వెలిగిస్తే మంచిది....హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది.
కార్తీకేయుడికి
కార్తీక మాసం కార్తీకేయుడికి ప్రత్యేకమైనది. అలాగే తులసి మాత పుట్టినరోజు కూడా. అలాగే తులసి వివాహం లేదా తులసి పూజ చేయడానికి ఇది ఆఖరి రోజు.
మహామృత్యుంజయ మంత్రం.
కార్తీక పౌర్ణమి రోజు మహా మృత్యుంజయ మంత్రం జపించాలి.
"ఓం త్ర్యంబకం యజామహే సుగంధిమ్ పుష్టివర్ధనం ఊర్వరుకమివ బంధానాన్మృత్యోర్ ముక్షియ మమ్రుతాత్" అనే ఈ మంత్రాన్ని 108సార్లు జపించాలి.
సాయంకాల దీపం
కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఇంటి ముందు, తులసికోట దగ్గర దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు తొలగి శుభం కలుగుతుంది. దీపం వెలిగించే అవకాశం లేనివాళ్లు శివాలయంలో ఆవు నెయ్యి సమర్పించినా,మంచి ఫలితం కలుగుతుంది.
ఆశ్వమేధ యాగం ఫలితం.
ఈ కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసి దీపం వెలిగించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. ఇలా ఇవాళ దీపం వెలిగించడం వల్ల అన్ని కోరికలు తీరుతాయి. కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి తులసి చెట్టుపక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీకపౌర్ణమి రోజున దీపారాధన చేయడంవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు.
పఠించవలిసిన శ్లోకం.
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః!
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతి టైం శ్వవచాహి విప్రాః!!
దీపం వెలిగించి దీప శిఖలో దామోదరుణ్ణి కానీ, త్రయంబకుడిని కానీ ఆవాహన చేసి పసుపో, కుంకుమో, అక్షతలో వేయాలి. అది కార్తీక దీపం దానికి నమస్కారం చేయాలి. ఆరోజు దీపం చాలా గొప్పది. ఆ దీపపు వెలుతురు మనమీద పడినా చాలు. ఈ పవిత్ర దినాన విష్ణువాలయంలో స్థంబదీపం పెట్టిన వారు శ్రీమహవిష్ణువుకి ప్రీతివంతులవుతారు. ఈ దీపాన్ని చూసిన వారి పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తారు. స్థంబ దీపం పెట్టని వారి పితృదేవతలకు నరక విముక్తి కలగదంటారు.
-
సేకరణ, తంత్ర విధానం
No comments:
Post a Comment